● వైభవంగా కొనసాగుతున్న నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ: అమృతం అసురులపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహావిష్ణువు దాల్చిన జగన్మోహిని అవతారంలో శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులను కనువిందు చేశారు. లోక కల్యాణార్థం ఏటా నిర్వహించే వార్షిక నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి జగన్మోహినీ అలంకరణలో దర్శనమిచ్చారు. వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన గావించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంబరాలతో మోహినీ అలంకరణ గావించారు. అనంతరం వివిధ పుష్పాలంకరణ గావించిన పూల పల్లకీని అధిరోహించి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడవీధుల్లో విహరిస్తూ శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూసితుడై భక్తులకు దర్శనమిచ్చారు.


