కర్నూలు కల్చరల్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజువారీ సగటున 2,36,000 లీటర్లు పెట్రోల్ వినియోగం జరుగుతుండగా ప్రస్తుతం జిల్లాలో 7 లక్షల లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందన్నారు. అదనంగా ట్రాన్సిట్లో 6,39,000 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నిల్వలతో ఆరు రోజుల వరకు సరఫరా కొనసాగించవచ్చన్నారు. డీజిల్ విషయంలో కూడా ఎటువంటి కొరత లేదన్నారు. మొత్తం కలిపి 11 లక్షల లీటర్లు డీజిల్ అందుబాటులో ఉండటంతో సుమారు 4 రోజుల సరఫరా నిరంతరం కొనసాగుతుందన్నారు. సాధారణ ధరలకే సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దన్నారు. పెట్రోల్, డీజిల్ను బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


