ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 19వ తేదీ సాయంత్రం భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడైన భర్త బోయ మీనుగ రాముడును అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. శనివారం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన బోయ మీనుగ రాముడు మద్యానికి బానిసైన భార్య నరసమ్మతో గొడవపడేవారు. దీంతో ఆమె భర్తను వదలి పుట్టింటికి వెళ్లారు. కుమార్తె ప్రసవం కోసం ఈనెల 19న ప్రభుత్వాసుపత్రికి నరసమ్మ వెళ్లగా భర్త రాముడు అక్కడికి వచ్చి అందరు చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పులే హత్యకు కారణమని విచారణలో నిందితుడు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సీఐతో పాటు పట్టణ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తదితరులు ఉన్నారు.


