కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఏఓ)కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె తన కార్యాలయంలో 908 వీఏఓలకు శ్యామ్సంగ్ 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు వీఏఓలు అందించే సేవలు చాలా ఉంటాయని, వారికి అవసరమైన సాంకేతికను అందిస్తే మరింత సేవ చేసే అవకాశం ఉండడంతో 5జీ స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమలో డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు.
మల్లన్న సేవలో ఎస్సీ కమిషన్ చైర్మన్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ ఏఈవో వెంకటేశ్వరరావు, అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో ఆయనకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంట కమిషన్ సభ్యులు గౌతమ్రాజు, దాసు తదితరులు ఉన్నారు.


