కర్నూలు(అర్బన్): రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం అని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సాలురెడ్డి అన్నారు. పసుపుల ఆర్ఎస్కేలో బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాలురెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా నిలకడైన వ్యవసాయ పద్ధతులను పాటించాలన్నారు. ఘన జీవామృతం, విత్తనాల పెల్లైటెజేషన్ ప్రాముఖ్యతను ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రాజేశ్వర్, జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం మాధురి వివరించారు. డీఆర్సీ ఏఓ రంగారెడ్డి, హెచ్ఓ నరేష్కుమార్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రుఫస్ రోనాల్డ్, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మంఠంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. మొత్తం రూ.3,25,96,854 సమకూరింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశానుసారంగా హుండీ లెక్కింపునకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక సారి కౌటింగ్ హాల్లోనికి ప్రవేశించిన తరువాత ఎవరినీ ఏ కారణంతోనూ బయటకు అనుమతించలేదు. హుండీ లెక్కింపునకు ఆలస్యముగా వచ్చే వారికి ప్రవేశం లేదు అని సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు. నగదు రూపేణా రూ. 3,15,62,354, నాణేల రూపంలో రూ.10,34,500 వచ్చినట్లు వివరించారు. అలాగే 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు ఏఏఓ మాధవశెట్టి , మేనేజర్–2 వెంటేష్ జోషి,ఇంజనీర్ సురేష్కోనాపూర్ తెలిపారు.
అక్రమంగా యూరియా అమ్మితే చర్యలు
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎక్కడైనా యూరియా అమ్మకాలు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశాల మేరకు కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని పలు పరిశ్రమల్లో యూరియా నిల్వలు, విక్రయాలు నిర్వహిస్తున్నారా అనే అంశంపై సివిల్ సప్లైస్ డీఎం, ఇండస్ట్రియల్ ఆఫీసర్, కార్మిక శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు యూరియాను అక్రమంగా నిల్వ ఉంచుకోరాదని, విక్రయాలు జరపరాదని సూచించారు.
పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమల పురోగతిపై బుధవారం కలెక్టరేట్లో తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం, భూసేకరణ, అవసరమైన అనుమతులు, ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో 38 పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు జరిగాయని, వాటిలో ఇంకా మొద లు కాని పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్కుమార్, ఏపీఐఐసీ జెడ్ఎం మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


