కర్నూలు(అర్బన్): జీవజాతుల మనుగడకు ఆధారమైన భూమిని కాపాడుకుందామని సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో యువజన సంక్షేమ శాఖ, సెట్కూరు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అందుకు ఆధారం గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలే అన్నారు. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతున్న క్లోరోఫోరో కార్బన్లు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయన్నారు. ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ వృక్షాలను విచక్షణా రహితంగా నరికి వేయడంతో అడవులు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థినులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్, మెమొంటోలు అందించారు.


