గతుకుల రోడ్డు
● ప్రయాణికులకు తప్పని తిప్పలు
కోడుమూరు రూరల్: ఏడాది అయినా కోడుమూరు నుంచి వెల్దుర్తికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతోప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతుల రోడ్డుపై ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం గతేడాది రూ.20కోట్లు విడుదల చేసింది. పనులు తీసుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకిరువైపులా కంకర, గ్రావెల్ పరిచి వదిలేశారు. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో కోడుమూరు నుంచి వెల్దుర్తికి వెళ్లే వాహనదారులతో పాటు వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, అనుగొండ, అమడగుంట్ల వంటి సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రావెల్ పరిచిన రోడ్డుపైన ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.


