కర్నూలు(సెంట్రల్): పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను ఈ నెల 25న పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పాలిసెట్ నిర్వహణపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25న పాలిసెట్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం సీనియర్ నోడల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 21 కేంద్రాల్లో 6,904 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా సరఫరా చేయాలని, విద్యార్థులకు అనువుగా బస్సులను నడపాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు ప్రత్యేకంగా పోలీసుల భద్రతన ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, డెప్యూటీ కమిషనర్ సతీష్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షల్లో 49 మంది
విద్యార్థులు గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు శనివారం 49 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. రెండవ సెమిస్టర్ పరీక్షకు 777 మందిలో 732 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 6వ సెమిస్టర్ పరీక్షలకు 38 మందిలో నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. బీఈడీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు 3,523 మందిలో 3,335 మంది హాజరయ్యారన్నారు. కర్నూలు శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు చూచి రాతకు పాల్పడుతుండగా డిబార్ చేశామన్నారు.


