సోషల్ మీడియాలో 17 ఆరోపణల చిట్టా వైరల్
ఎమ్మెల్యేకు రూ.10 లక్షలు ఇచ్చింది వాస్తవమే
ప్రజల దృష్టి మరల్చేందుకే మసీదులో అవినీతి అంటూ డ్రామా
జామియా మసీదు ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ, టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌది రావూఫ్
ఆదోని అర్బన్: ఎమ్మెల్యే పార్థసారథికి రూ.10 లక్షలు ఇచ్చింది వాస్తవమే. ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. దీన్ని మరిపించేందుకే మసీదులో అవినీతి జరిగిందని చెబుతున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 17 అవినీతి ఆరోపణల చిట్టాకు ఎమ్మెల్యే సమాధానమివ్వాలని జామియా మసీదు ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ, టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌది రావూఫ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఫ్యాక్టరీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పార్థసారథి మసీదులో అవినీతి జరిగిందని సోమవారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విదేశాల నుంచి తన బంధువులకు డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందని నిరూపిస్తే గొంతు కోసుకుంటానని చెప్పారు. మసీదుకు రూ.వెయ్యి ఇస్తే రూ.10 రసీదు ఇస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారని, ఒక్కరి వద్దనైనా రసీదు చూపించాలన్నారు. తన సొంత డబ్బుతో మసీదుకు కొంతమేర ఖర్చు చేస్తున్నానని స్పష్టం చేశారు. కోర్టు అనుమతి తెస్తే ఎన్నికలు జరుపుదామని సవాల్ విసిరారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ఎమ్మెల్యేకు రూ.10 లక్షలు ఇచ్చినందుకే తాను నిర్మిస్తున్న భవనాన్ని పునాది దశలో, టాప్ దశలో ఆపలేదని, మరింత డబ్బు అడగ్గా తాను ఇవ్వనందుకే మున్సిపల్ అధికారులు, పోలీసులతో కలిసి అడ్డుకుంటున్నారన్నారు. సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఈ 17 అవినీతి ఆరోపణల చిట్టాకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాత్రనక, పగలనకా కష్టపడి ఎన్నికల్లో గెలిపిస్తే మాపైనే అస్త్రం ఉపయోగిస్తావా అని వాపోయారు.


