నంద్యాల(అర్బన్): నంద్యాల అభివృద్ధికి మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి చేసిన అభివృద్ధిపై టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ సవాల్ విసిరారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా వేలాది మంది కుటుంబాలకు లబ్ధి పొందుతుంటే ఓర్వలేని టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక శిల్పా స్వగృహంలో ఆదివారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూనెపల్లె మార్కెట్యార్డులో రెండు ఎకరాల స్థలాన్ని ఏడాదికి రూ.2 వేలకే 33 ఏళ్ల పాటు టీడీపీ కార్యాలయ ఏర్పాటుకు లీజుకు తీసుకోవడం రైతులను వంచించడం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. శిల్పా కుటుంబంపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. శిల్పా సహకార్ ద్వారా నిత్యావసరాలపై 10 శాతం రాయితీ ఇస్తుంటే దానిపై విమర్శలు చేయడం సిగ్గు చేటని, టీడీపీ నాయకులకు దమ్ముంటే ఇలాంటి రాయితీ సరుకులను ప్రజలకు అందించి మెప్పు పొందాలన్నారు. నందమూరినగర్ బ్రిడ్జి, ఉర్దూ కాలేజీ పనులను ఇంత వరకు పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. బొగ్గులైన్ వాసులకు గత ఎన్నికల సమయంలో నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేయడం దుర్మార్గమన్నారు. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ప్రజలు మిమ్మల్ని గమనించడం లేదనుకోవడం అవివేకమని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, కార్యదర్శి దేవనగర్ బాషా, మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
రైతుల భూములను టీడీపీ
కార్యాలయాలకు
కేటాయించడం దారుణం
శిల్పా కుటుంబంపై తప్పుడు
ఆరోపణలు చేస్తే సహించం


