● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): కర్నూలు నగర అభివృద్ధికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఎంతో కృషి చేశారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. నగరపాలకసంస్థకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.800 కోట్లు ఖర్చు చేసి కర్నూలులో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. నగరంలోని 52 వార్డుల్లో గడపగడపకు వెళ్లి 2021 నుంచి 2026 వరకు ప్రజల సమస్యలు పరిష్కారించామన్నారు. రూ. 28 కోట్లతో నూతన నగరపాలక కార్యాలయం, రూ.28 కోట్లతో సుంకేసుల నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు పైపులైన్ పనులు చేశారన్నారు. రాష్ట్రంలోనే అద్భుతంగా మున్సిపల్ పార్కులు అభివృద్ధి చేసి క్రీడా వసతులు కల్పించినట్లు చెప్పారు. అలాగే 2023లో స్వచ్ఛతలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో కర్నూలు కార్పొరేషన్ నిలవడం వెనుక ప్రతి కార్పొరేటర్ కృషి ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న వారందరికీ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తారని జగనన్న హయంలో కర్నూలు మహిళా కార్పొరేటర్లు నిరూపించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేసిన ఘనత జగనన్నదే అన్నారు. ఐదేళ్ల పాటు నిజాయితీగా పనిచేశారని, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. తాజా మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు షరీఫ్, నరసింహులు యాదవ్, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.


