మార్చురీలో ప్రస్తుతం ఒక్క వాక్ ఇన్ కూలర్ సౌకర్యం ఉన్న గది మాత్రమే పనిచేస్తోంది. దీనిని శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా రక్తపు మరకలతో దుర్వాసన కొడుతోంది. ఇందులోనే తాజాగా తీసుకొచ్చిన మృతదేహాలను ఉంచుతున్నారు. వాటిని కూడా నేలపైనే రక్తపు మరకలపై పడుకోబెడుతున్నారు. మూడు బాడీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వాటికి తాళాలు వేశారు. ఎంఎల్సీ విషయంలో కొన్నిసార్లు ఆలస్యమయ్యే మృతదేహాలు, అనాథ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే విషయంలో కొన్నిసార్లు రోజులు పడుతుంది. అలాంటి వాటిని ఫ్రీజర్లలో ఉంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడంతో వాక్ఇన్ కూలర్లోనే వాటిని ఉంచాల్సి రావడంతో ఆ ప్రాంతం దుర్వాసన కొడుతోంది. ప్రస్తుతం వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ దుర్వాసన ఎక్కువ దూరం వ్యాపిస్తోంది. రాత్రివేళలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దీంతో రాత్రివేళల్లో అటువైపు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్చురిలో ఉన్న మృతదేహాలను చూసి వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.


