వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్పై యుద్ధంలో అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 19 యుద్ధ విమానాలను కోల్పోయినట్టు ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్ఐఎన్టీ) నివేదిక పేర్కొంది. పలు హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఇరాన్ కూల్చేసినట్టు వెల్లడించింది.
ఈ జాబితాలో రూ.3,300 కోట్ల విలువైన నాలుగు ఎఫ్–15ఇ ఫైటర్ జెజట్లు, రూ.174 కోట్ల విలువైన ఏ–10 థండర్బోల్ట్2 విమానం, రూ.740 కోట్లకు పైగా విలువ చేసే 2 కేసీ–135 ఇంధన ట్యాంకర్ విమానాలు, మరో 11 విమానాలున్నాయి. రూ.6,500 కోట్ల విలువైన బోయింగ్ ఇ3 సెంట్రీ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాన్ని సైతం ఇరాన్ సర్వనాశనం చేసింది. రూ.4,700 కోట్ల విలువైన 17 ఎంక్యూ–9 రకం రీపర్ డ్రోన్లను కూడా కూల్చేసింది.
హార్మూజ్ను తెరవండ్రా!
ఇరాన్పై ట్రంప్ బూతు పురాణం
హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఆ క్రమంలో బూతుపురాణానికి దిగారు. ‘‘హార్మూజ్ను తెరవండ్రా పిచ్చి బాస్టర్డ్స్! ఇందుకు సోమవారమే డెడ్లైన్. ఆలోపు తెరవలేదంటే నరకానికి పంపిస్తా. చూస్తూ ఉండండి. అల్లాను ప్రార్థించండి. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జి డే. అవన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇరాన్ విద్యుత్కేంద్రాలను, వంతెనలను సర్వనాశనం చేస్తాం’’ అంటూ ఆదివారం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. హార్మూజ్ తెరిచే విషయంలో ఎంత దూరమైన వెళ్తానని చెప్పారు. ‘‘సోమవారం నాటికి ఇరాన్తో చర్చల్లో పురోగతి సాధ్యం కావొచ్చు. మాతో ఒప్పందానికి రాకపోతే మాత్రం ఇరాన్ను అగ్నికి ఆహుతి చేస్తాం. అక్కడి చమురును కూడా స్వాదీనం చేసుకుంటాం’’ అంటూ హెచ్చరించారు.


