కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ నోటి మాటలకే పరిమితమైంది. గత ఏడాది 2024 జూలై నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు అంటూ హడావుడి చేస్తున్నా.. ఆచరణలో 10 నుంచి 20 శాతం మించని పరిస్థితి. ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కూడా అస్తవ్యస్తమైంది. ఉదయం 10 గంటలు దాటినా సచివాలయ ఉద్యోగుల జాడ లేకపోవడంతో మండుటెండలో వృద్ధులు, వికలాంగులు అతి కష్టం మీద సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎండలు, వడగాడ్పులకు అవ్వతాతలు ఇబ్బందులు పడ్డారు. కాగా గోనెగండ్ల మండలం కై రవాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 5.30 గంటల సమయానికి కర్నూలు జిల్లా 92.15 శాతం పంపిణీతో 17వ స్థానంలో, నంద్యాల జిల్లా 92.76 శాతంతో 9వ స్థానంలో నిలిచాయి.


