కర్నూలు సిటీ: జగన్నాథగట్టుపై ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్ఐటీ డీఎం) లో గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇండోర్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 ట్రిపుల్ ఐటీల నుంచి మొత్తం 357 మంది క్రీడాకారులు ఇండోర్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ క్రీడల్లో పోటీలు జరుగనున్నాయి.
గుండెపోటుతో బాలుడి మృతి
కోసిగి: బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే రైలులో ప్రయాణిస్తూ కోసిగి రైల్వే స్టేషన్ చేరుకునే సమయంలో ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా తుముకూరు గ్రామానికి చెందిన శివప్ప, యల్లమ్మ దంపతుల రెండో కుమారుడు రమేష్ (14) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆ కుటుంబం బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లి పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాలుడు ఛాతిలో నొప్పి అంటూ అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు కోసిగి రైల్వేస్టేషన్లో దిగి హుటాహుటిన పీహెచ్సీకి తరలించగా వైద్య పరీక్షలు చేసేలోపు బాలుడు మృతి చెందాడు. చిన్న వయస్సులోనే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
దాడిలో గాయపడిన
వ్యక్తి మృతి
ఓర్వకల్లు: దాడి ఘటనలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన వ్యక్తి కోలుకోలేక ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కన్నమడకల గ్రామంలో ఈ నెల 29వ తేదీన బోయ మహేష్ అదే గ్రామానికి చెందిన కప్ప రమేష్ను కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. గాయపడిన రమేష్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, ఘర్షణకు గల కారణాలను తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి పెద్ద కుమారుడు కప్ప హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు బోయ మహేష్, బాలకృష్ణపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య మహేశ్వరి, ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు.
ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు
కర్నూలు: వేసవిలో రోడ్లపై ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది రక్షణ కోసం చలువ అద్దాలు, వాటర్ బాటిళ్లు, కూల్ వాటర్ క్యాన్లు, టోపీలు, గ్లూకోజ్–డి ప్యాకెట్లు పంపిణీ చేశారు. జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించేలా పోలీసు శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యతతో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో సేకరించిన రక్షణ కిట్లను బుధవారం కొండారెడ్డిబురుజు వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు మహబూబ్నగర్ కెనరా బ్యాంకు సహకారంతో ఇండికేటింగ్ కోన్స్, డ్రాగన్ లైట్లు, లైటింగ్ బాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు (రేడియం), కంబళ్లు, సుత్తెలు వంటి పరికరాలను అందజేశారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్ రావు, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.


