ఆలయానికి బురదలోనే వెళ్తున్న భక్తులు
కొత్తపల్లి: శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సప్తనది సంగమ ప్రాంతంలో వెలిసిన ప్రాచీన సంగమేశ్వరుడు జలాధివాసం వీడారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత పూర్తి స్థాయిలో ఆలయం బయటపడింది. ఆలయంలో చుట్టూ ఒండ్రు బురద పేరుకుపోయింది. గర్భగుడిలో, ఆలయ ముఖమండపంలో బురద నీటితో నిండి ఉంది. అయినా శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రాచీన సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. బురదలోనే ఒకరి వెంట ఒకరు నడుస్తూ ప్రాచీన ఆలయానికి వెళ్లి స్వామికి పూజలు చేశారు. చుట్టూ నీరు మధ్యలో సంగమేశ్వరాలయం సందర్శకులకు కనువిందు చేస్తోంది. పండుగ సెలవులు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఉంది. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివ లింగానికి, లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయం చుట్టూ బురద, రాళ్లు, రప్పలు ఉన్నాయని, ప్రమాదానికి ఆస్కారముందని, అంతా శుభ్రం చేసే వరకు ఆలయం లోపలికి ఎవరూ రావద్దని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు.


