కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
కంకిపాడు: గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త, వ్యర్థాలు పేరుకుపోకుండా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు చెత్తను తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మండలంలోని నెప్పల్లి గ్రామంలో బుధవారం కలెక్టర్ బాలాజీ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త, వ్యర్థాలు నిర్దేశించిన సంపద తయారీ కేంద్రానికి మాత్రమే తరలించాలన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరువేరుగా పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. శ్మశానవాటికల నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామన్నారు. గ్రామస్తులు పలువురు తామెదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.భావనారాయణ, డీఎల్పీఓ సంపత్కుమారి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.


