వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ లక్ష్మీశ
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ సర్వేక్షణ్లో సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్ నిలబెట్టుకోవడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సమష్టిగా పని చేసి ర్యాంకుల సాధనకు కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్, జనగణనపై బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మునిసిపల్ కార్పొరేషన్లోని వివిధ శాఖాధిపతులు, స్వర్ణ వార్డుల సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ వేసవికి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు పాల్గొన్నారు.
సత్తా చాటుదాం..
పటమట(విజయవాడతూర్పు): స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానమే లక్ష్యంగా అడుగేసి సత్తా చాటుదామని, వినూత్న కార్యాచరణ, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ఇది సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనం సమావేశ మందిరంలో 30కు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్డబ్ల్యూఏ), టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి స్వచ్ఛతలో నగర కీర్తిప్రతిష్టలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల అమల్లో ఆర్డబ్ల్యూఏల భాగస్వామ్యంపై లక్ష్మీశ చర్చించారు. అసోసియేషన్ల ప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే మంచి ర్యాంకులు సాధించామని, 2025–26కు సంబంధించి కూడా ముందంజలో నిలిచేందుకు కృషిచేస్తున్నామని మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. డెప్యూటీ డైరెక్టర్ (ఉద్యాన) చంద్రశేఖర్ పాల్గొన్నారు.


