పోషకాహార లోపం.. గర్భిణులకు శాపం
గర్భిణుల్లో రక్తహీనత ఇలా..
పోషకాహారం అందిస్తున్నాం
● గర్భిణులను తీవ్రంగా వేధిస్తున్న రక్తహీనత సమస్య
● ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారిలో
ఆరు, ఏడు శాతమే హిమోగ్లోబిన్
● ఒక్కొక్కరికీ రెండు, మూడు
యూనిట్ల రక్తం అవసరం
● గర్భిణులకు సంపూర్ణంగా
అందని పోషకాహారం వల్లే సమస్య
● గత ప్రభుత్వ హయాంలో గర్భిణులకు
సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరికీ సంపూర్ణ పోషకాహారం ప్రకటనలకే పరిమితం అవు తోంది. నిరుపేద మహిళల్లో పోషకాహార లోపం గర్భిణీ సమయంలో శాపంలా మారుతోంది. రక్తహీనత ఉన్న గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలతో పాటు, శిశువుల ఎదుగుదల కూడా సక్రమంగా ఉండటం లేదు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిలో హిమోగ్లోబిన్ తొమ్మిది శాతం కంటే తక్కువగా ఉన్న వాళ్లే ఎక్కు వగా ఉంటున్నారు. హెచ్బీ మూడు లేదా నాలుగు శాతం ఉన్న వాళ్లు కూడా వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రసవం చేయడం అత్యంత క్లిష్టతరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోషకాహారం అందించే విషయంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అందించిన సంపూర్ణ పోషకాహారం కిట్లు సైతం ఇప్పుడు అందడం లేదని చెపుతున్నారు.
తల్లీబిడ్డలకు సమస్యలు
పోషకాహార లోపం వల్ల గర్భిణుల్లో అలసట, బలహీనత, దడ, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. నెలలు నిండకుండా ప్రసవం జరగ డంతో ప్రీటామ్ బేబీలు పుట్టడం, నెలలు నిండినా శిశువు తక్కువ బరువు ఉండటం, ప్రసవ సమ యంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో మాతా శిశు మరణాలకు దారితీసే ప్రమాదం ఉంది.
గర్భిణులకు అందని పోషకాహారం
పోషకాహార లోపం నివారణ నినాదం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం అవుతోంది. పేద గర్భిణులకు పోషకాహారం అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో గర్భం దాల్చిన మహిళలకు సంపూర్ణ పోషకాహార కిట్లకు అందించే వారు. అందులో భాగంగా పాలు, కందిపప్పు, చిక్కీ, నూనె , బియ్యం, కోడిగుడ్లు వంటివి అందించే వారు. ఇప్పుడు రేషన్ బియ్యం, పుచ్చి పోయిన కందిపప్పు, రాళ్లు ఉన్న రాగిపిండి వంటివి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గర్భిణుల్లో రక్తహీనత సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది.
సమన్వయలోపం
గర్భిణులకు పోషకాహారం అందించే విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా గర్భిణులకు పోషకాహారం అందడం లేదు. ఇటీవల కంచికచర్ల మండలంలో ఆరు నెలల గర్భిణికి పోషకాహారం అందించే విషయంలో వైద్యశాఖ మ్యాపింగ్ చేయలేదు. దీంతో ఆమెకు పోషకాహారం అందడంలేదు. వైద్యశాఖ సిబ్బంది ఆ వైపు కన్నెత్తి చూపడటం లేదు. ఆ ఫలితంగా గర్భిణికి పోషకాహారంతో పాటు, వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఇలా ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక ప్రాంతాల్లో నెలకొంది. శాఖల మధ్య సమన్వయ లోపం మహిళలకు శాపంలా మారుతుంది.
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు వస్తుంటారు. ప్రతి నెలా 700 నుంచి 900లకు పైగా కాన్పులు జరుగుతాయి. ప్రసవం కోసం వచ్చే వారిలో రక్తహీనత లోపం ఉన్న వారే ఎక్కువని వైద్యులు చెపుతున్నారు. గర్భిణుల్లో హిమోగ్లోబిన్ పది శాతం కంటే తక్కువ ఉంటే రక్తహీనతగా, ఏడు లేదా అంతకంటే తక్కువ శాతం ఉంటే తీవ్రమైన రక్తహీనతగా పరిగణిస్తారు. జీజీహెచ్కు వస్తున్న వారిలో 10 శాతం కంటే ఎక్కువ ఉన్న వారు 15 శాతం, 8,9 శాతం ఉన్న వారు 25 శాతం, 7, 8 గ్రాముల శాతం ఉన్న వారు 45 శాతం, ఆరు శాతం, అంత కంటే తక్కువ ఉన్న వారు 15 శాతం మంది ఉంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి రిఫరల్ వచ్చిన వారిలో నాలుగు శాతం ఉన్న వారిని కూడా చూస్తున్నామని వైద్యులు అంటున్నారు. అలాంటి వారికి రెండు, మూడు యూనిట్ల రక్తం ఎక్కిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో గుర్తించిన ప్రతి గర్భిణి, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నాం. అందులో భాగంగా గుడ్లు, పాలుతో కూడిన ఆహారం అందిస్తున్నాం. మహిళల్లో రక్తహీనత లేకుండా చూస్తున్నాం.
– రుక్సానా,
పీడీ, ఐసీడీఎస్, ఎన్టీఆర్ జిల్లా


