ముహూర్తం కోసం వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

ముహూర్తం కోసం వెళ్లి..

Sep 10 2025 10:12 AM | Updated on Sep 12 2025 10:58 AM

ముహూర

ముహూర్తం కోసం వెళ్లి అనంతలోకాలకు..

కంచికచర్ల: కుమారుడి వివాహానికి ముందు తమ ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు తేదీ ఖరారు చేసేందుకు గురువు వద్దకు వెళ్లి ఆనందంతో తిరిగి వస్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి కుమార్తె ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్‌ ఉన్నారు. కుమార్తెను తమ గ్రామానికే చెందిన సాయికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు చంద్రశేఖర్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహం కుదిరింది. కుమారుడి వివాహం చేసే ముందుగా తమ ఇంట్లో వెలసిన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు తెలంగాణ రాష్ట్రం, ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఉన్న ఓ పూజారి వద్దకు వెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆనందంగా బైక్‌పై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన వారిని ఎర్రుపాలెం, తక్కెళ్లపాడు మధ్యలో ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతుల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్‌, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీనివాసరావు దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌ గని ఆత్కూరు గ్రామానికి వెళ్లి వారి భౌతికకాయాలను సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

లారీ ఢీకొని మృతిచెందిన దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement