
సర్కారు బడుల సత్తా
చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరికలకు మెరుగులు దిద్దుతున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత అందలం
పాఠశాలలకు గుర్తింపు..
ప్రత్యేక శిక్షణతో రాణింపు..
ఎక్స్లెన్సీ అవార్డులు పొందిన పాఠశాలల వివరాలు..
కృష్ణా జిల్లాలో ఐదు స్కూళ్లకు బెస్ట్ స్పోర్ట్స్ ఎక్స్లెన్సీ అవార్డులు
కంకిపాడు: విద్యార్థుల వికాసానికి చదువుతో పాటుగా క్రీడలూ ముఖ్యమే. మారుతున్న పరిస్థితులతో ఎక్కువ మంది చదువు, తద్వారా వచ్చే మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విద్యార్థుల జీవితం తరగతి గదుల్లోనే మగ్గుతోంది. రానురాను విద్యార్థులు శారీరక వికాసానికి దూరం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు పాఠశాలలు విద్యార్థులను చదువుతో పాటుగా క్రీడల్లోనూ తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలు, అథ్లెటిక్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పోటీల్లో తలపడుతూ పతకాలు పొందుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చొరవతో ఎక్స్లెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో కృష్ణాజిల్లాకు చెందిన ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఎక్స్లెన్స్ అవార్డులను అందుకుని ఆదర్శంగా నిలిచాయి.
సత్తా చాటుతున్న విద్యార్థులు..
క్రీడల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆట స్థలంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఉపాధ్యాయులు, శిక్షకులు అందించే ప్రోత్సాహం, తర్ఫీదుతో మెరికల్లా మారుతున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పతకాలు పొందుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రవేశించి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024–25 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులను జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు తమ సొంతం చేసుకున్నాయి. జెడ్పీ పమిడిముక్కల, జెడ్పీ గూడూరు, సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం, జెడ్పీ (బాలికలు) గన్నవరం, జెడ్పీ గొడవర్రు పాఠశాలలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఎక్స్లెన్స్ అవార్డులను దక్కించుకున్నాయి.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..
ప్రధానంగా హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు రాణిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. వారికి అవసరమైన పోషకాహారాన్ని అదనంగా అందజేస్తూ శారీరకంగా దృఢంగా ఉండేలా తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్త్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో 25 నుంచి 40 మంది విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటుతూ పాఠశాలలకు గుర్తింపు తెస్తున్నారు.
పాఠశాల పేరు లభించిన లభించిన
పాయింట్లు స్థానం
జెడ్పీ పమిడిముక్కల 192 ప్రథమస్థానం
జెడ్పీ గూడూరు 107 ద్వితీయ స్థానం
సీపీఎంహెచ్ఎస్
మచిలీపట్నం 100 తృతీయ స్థానం
జెడ్పీ (బాలికలు) గన్నవరం 93 నాలుగో స్థానం
జెడ్పీ గొడవర్రు 44 ఐదో స్థానం
విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించటంతో పాటుగా జాతీయ స్థాయిలోనూ ప్రవేశించి ప్రతిభ చాటుతున్నారు. పాఠశాలకు ప్రత్యేకంగా గుర్తింపు లభిస్తోంది. విద్యార్థుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరిస్తూ తర్ఫీదు ఇస్తూ వారికి మెలకువలు నేర్పుతున్నారు. ఏటా వివిధ స్థాయి లో విద్యార్థులు పతకాలు దక్కించుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు.
– కొండిశెట్టి సుబ్రహ్మణ్యం, హెచ్ఎం, జెడ్పీ గొడవర్రు
మైదానాన్ని సిద్ధం చేసుకోవటం, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం కీలకమైన అంశం. ఇందుకు కొందరు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న చేయూత కూడా మరువలేనిది. విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిభ చాటేలా మెలకువలు నేర్పుతున్నాం.
– కె.టాన్యాగిరి, పీడీ, జెడ్పీ గన్నవరం(బాలికలు)

సర్కారు బడుల సత్తా

సర్కారు బడుల సత్తా

సర్కారు బడుల సత్తా