
లక్ష్యాన్ని అధిగమించడం అభినందనీయం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో పేర్ల నమోదు ప్రక్రియ నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించడం అభినందనీయమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో 7,19,464 మందిని యోగాంధ్ర కార్యక్రమంలో చేర్చాలని లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 7,24,047 మందిని చేర్చారని, నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేసిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందికి అభినందిస్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 19వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగే ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని, ఈనెల 21వ తేదీన జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో అన్ని గ్రామాలలో ఇప్పటివరకు 4,826 యోగా శిక్షణ వేదికలను సిద్ధం చేశామని అందులో 3,104 వేదికలను ఇప్పటివరకు జియో ఫెన్సింగ్ చేశామని మిగిలిన వాటిని కూడా సత్వరమే జియో ఫెన్సింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈనెల 16వ తేదీ సోమవారం నుంచి 18వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో మూడో దశ యోగా శిక్షణ తరగతులు యోగా ట్రైనర్ల ద్వారా నిర్వహిస్తామన్నారు.
వక్ఫ్ భూముల వద్ద
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
పెనమలూరు: తాడిగడప, పెదపులిపాక గ్రామాలలో ఉన్న కొండపల్లి ఖాజీ, వక్ఫ్ భూములను రాష్ట్ర, జిల్లా వక్ఫ్ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఏపీ వక్ఫ్ బోర్డు సీఈవో మహమ్మద్ ఆలీ, జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి ఎండీ నాహూ ఆలీషా, కొండపల్లి ఖాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేనీ, వక్ఫ్ అధికారి ఎండీ కరీముల్లా కలిసి ఆ భూముల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. వక్ఫ్ భూములు ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు అనుమతులు రాగానే వేలం పాడిన రైతులకు 11 నెలలు కౌలు లీజుకు భూములు అప్పగిస్తామని వక్ఫ్ అధికారులు తెలిపారు.
వక్ఫ్ బోర్డుకు ఆదాయం..
గత కొద్ది రోజుల క్రితం వక్ఫ్ భూములు దాదాపు 40 ఎకరాలను పెనమలూరు తహసీల్దార్ ఏక్సాల్లీజ్ కౌలు వేలం నిర్వహించారు. దీని ద్వారా వక్ఫ్కు రూ. 24,08,415 ఆదాయం సమకూరింది. గతంలో కొందరు టీడీపీ నేతలు వక్ఫ్ భూములను ఆక్రమించి నయాపైసా కౌలు ఇవ్వకుండా దాదాపు 40ఏళ్లు పంట సాగు చేసి సొమ్ము బొక్కేశారు. ఇది దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వక్ఫ్ భూములు ఆక్రమణలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
దుర్గమ్మకు నృత్య నీరాజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో అనకాపల్లికి చెందిన శ్రీవెంకట సాయి డ్యాన్స్ అకాడమీకి చెందిన చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శిరీష పర్యవేక్షణలో 24 మంది చిన్నారులు పలు కీర్తనలకు నృత్య ప్రదర్శన ఇచ్చారు. సుమారు రెండు గంటల పాటు సాగిన నృత్య ప్రదర్శన ఆద్యంతం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం శిష్యబృందానికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలను అందజేశారు.
ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రికి స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్కు ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆయన న్యూఢిల్లీ నుంచి విమానంలో ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి గుడివాడ రెవెన్యూ డివిజినల్ అధికారి జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పీయుష్ గోయల్ రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లి బయలుదేరి వెళ్లారు.

లక్ష్యాన్ని అధిగమించడం అభినందనీయం

లక్ష్యాన్ని అధిగమించడం అభినందనీయం