ఆధారాలుంటే చూపించండి | - | Sakshi
Sakshi News home page

ఆధారాలుంటే చూపించండి

Jun 16 2025 7:13 AM | Updated on Jun 16 2025 7:13 AM

ఆధారాలుంటే చూపించండి

ఆధారాలుంటే చూపించండి

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రాజకీయంగా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తీవ్రంగా ఖండించారు.మచిలీపట్నంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్ని కిట్టు మాట్లాడారు. బందరు పోర్టును మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ లబ్ధి కోసం గోగిలేరుకు అమ్మేశాడంటూ కొల్లు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పేర్ని నాని బందరుపోర్టును గోగిలేరుకు తరలించేందుకు సంతకం చేశారనేందుకు ఏవైనా సాక్ష్యాలు ఉంటే ప్రజల ఎదుట పెట్టాలని సవాల్‌ చేశారు. పేర్నిని డిస్‌క్వాలిఫై చేయాలంటూ మంత్రి మాట్లాడటం చూస్తుంటే జాలి కలుగు తోందన్నారు.

రాజకీయ సన్యాసం తీసుకున్నారా?

2018లో బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాటలు మరిచిపోయారా అంటూ కిట్టు ఎద్దేవా చేశారు. రాజకీయ సన్యాసం తీసుకోకుండా ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని పోటీ చేశారని ప్రశ్నించారు. పనుల్లో పర్సంటేజీల కుటుంబం ఎవరిదో ప్రజలే చెబుతారన్నారు. ఎన్నికలు మరో నెల రోజులు ఉన్నాయనగా 2018 ఫిబ్రవరి 8వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని బందరు తీసుకువచ్చి హడావుడిగా టెంకాయలు కొట్టించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

కోర్టును ఆశ్రయిస్తే తప్పేంటి..

అన్యాయం జరిగితే న్యాయం కోసం ఎవరైనా ఆశ్రయించేది కోర్టునే అన్న విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తెలుసుకోవాలని పేర్ని కిట్టు అన్నారు. ఆ నాడు మర్డర్‌ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వస్తే ఇంటి వెనుక గోడ దూకి ఎందుకు పారిపోయారని నిలదీశారు. బందరు నుంచి పారిపోయి తునిలో పోలీసులకు చిక్కిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఆనాడు బెయిల్‌ను కోర్టు నుంచి కాకుండా నారా చంద్రబాబునాయుడు నుంచి తెచ్చుకున్నారా అని ప్రశ్నించా చేశారు. తన తండ్రి పేర్ని నాని తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారన్నారు. రాజకీయాల్లోకి కుటుంబాల్లోని మహిళలను తీసుకురావటం దుర్మార్గమన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని మంత్రి రవీంద్ర గుర్తుంచుకోవాలన్నారు. తమ రోజు అంటూ వచ్చాక ఆ రోజు తానేంటో.. తనకు తన తల్లి మీద ఉన్న ప్రేమ ఏంటో కచ్చితంగా చూపిస్తానంటూ మంత్రిని హెచ్చరించారు.

మంత్రి కొల్లు రవీంద్రపై మండిపడిన వైఎస్సార్‌ సీపీ మచిలీపట్నం ఇన్‌చార్జ్‌ పేర్ని కిట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement