
ఐక్య ఉద్యమానికి కార్యాచరణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శాతవాహన కళాశాలకు చెందిన భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వీ.సాంబిరెడ్డి డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆ కళాశాల పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ అధ్యాపకుల సమావేశం (గెట్ టూ గెదర్) విశాలాంధ్ర పత్రిక కార్యాలయం ఆవరణలో ఆదివారం జరిగింది. వి.సాంబిరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పు పేరుతో కళాశాల భవనాలను కూల్చివేసిన వారే భవనాలను నిర్మించాలన్నారు. కళాశాల సమస్య పరిష్కారం కోసం అవసరమైతే పరిరక్షణ కమిటీ తరఫున కోర్టులను ఆశ్రయించి న్యాయ పోరాటం చేసైనా కళాశాలను రక్షించుకోవాలన్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలు అందజేయడంతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.
చట్టపరంగా చర్యలు తీసుకోవాలి..
కమిటీ కో–కన్వీనర్ డి.విష్ణువర్థన్ మాట్లాడుతూ రాత్రి వేళ భవనాలను కూల్చి వేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ కో– కన్వీనర్స్ ఎం.అరుణ్కుమార్, ఎన్.సాంబశివరావు, పూర్వ విద్యార్థులు బైపూడి నాగేశ్వరరావు, సైనుద్దీన్, శ్రీనివాసరావు, కిరణ్, విద్యార్థి సంఘాల నాయకులు రవిచంద్ర, రాజేష్, షణ్ముఖ్తో పాటుగా రిటైర్డ్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ సమావేశంలో నిర్ణయం