
కూటమి పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, కార్మికులు, కర్షకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. కార్మికుల కోసం సంక్షేమ పథకాలు లేవని, వారిని పట్టించుకోవడం వదిలేశారని ఆరోపించారు. మేడే సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్టీయూసీ, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న దేవినేని అవినాష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు ప్రతి ఏటా వాహనమిత్ర పేరుతో రూ.10 వేలు ఇచ్చారని, కేసులు, జరిమానాలు లేకుండా ఐదేళ్ల పాటు ఆటోకార్మికులు ఆనందంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఏటా రూ.10 వేలు ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చిందని, కానీ నేడు టీడీపీ నేతలు చిరు వ్యాపారులను నిత్యం మామూళ్లతో దోచుకుంటున్నారన్నారు. అప్కాస్ ఏర్పాటు చేసి చిరు ఉద్యోగులు, కార్మికులకు క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం దానిని ఎత్తేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అసలు పాలన ఉందా?
సింహాచలం వంటి వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన ఉందా అనే అనుమానం కలుగుతోందని అవినాష్ అన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో తొక్కిసలాట, ఇప్పుడు సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలన్నారు.
రెడ్బుక్ అమలుపైనే దృష్టి
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే పాలకులు దృష్టి పెడుతున్నారని, పాలనను గాలికొదిలేశారని దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టిన రక్షణ గోడ వరదల నుంచి లక్షలాది మందిని కాపాడిందని, కూటమి ప్రభుత్వంలో సింహాచలంలో కట్టిన గోడ 8 మంది ప్రాణాలు తీసిందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ప్రతి కార్మికుడికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి, అనుబంధ విభాగాల అధ్యక్షులు గొట్టిపాటి హరీష్, ఏలూరి శివాజీ, శెటికం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏ ఒక్కరూ ఆనందంగా లేరు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు ఆటో రోడ్డెక్కితే జరిమానాల బాదుడు మేడే వేడుకల్లో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్