
నెప్పల్లి భూములు అన్నసత్రం కమిటీవే
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖదిగా చెబుతున్న కృషా ్ణజిల్లా నెప్పల్లి గ్రామంలో ఆర్ఎస్ నెం 101లోని 4.41 ఎకరాల భూమి విజయవాడలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీకి చెందిన భూమిగా ఆ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బచ్చు వెంకటలక్ష్మీ వరప్రసాద్, బి. రాజేష్ చెప్పారు. ఈ సందర్భంగా అన్నసత్రం కమిటీ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 150 ఏళ్ల క్రితం విజయవాడలో ఆర్యవైశ్య యాత్రికుల వసతి, భోజన సదుపాయాల కోసం శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ పేరుతో సంస్థను తమ పూర్వీకులు ఏర్పాటు చేశారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆర్యవైశ్య సంస్థలు ఏర్పాటు చేశారన్నారు.
ఆర్యవైశ్యులు భూములు ఇచ్చారు
తమ సంస్థ కొనసాగించేందుకు అనేక మంది ఆర్యవైశ్యులు కొంత భూములను సంస్థకు అందించారన్నారు. ఆ క్రమంలో నెప్పల్లిలో తమకు 4.41 ఎకరాల భూమి ఉందన్నారు. 150 ఏళ్ల నుంచి తమ ఆధీనంలోనే అది కొనసాగుతోందని చెప్పారు. దాని పన్నులు తమ సంస్థే చెల్లిస్తోందన్నారు. సుమారు వంద ఏళ్లకు పూర్వం నుంచి ఒకే కుటుంబం మూడు తరాలుగా (ప్రస్తుతం దేవినేని దుర్గాప్రసాద్) దానిని తమ సంస్థ నుంచి కౌలుకు తీసుకొని సాగు చేస్తోందన్నారు. దానికి సంబంధించి సుమారు 75 ఏళ్లుగా ఆ రశీదులు, రిజిస్టర్ అగ్రిమెంట్లు, పాస్బుక్లు తమ వద్ద ఉన్నాయన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వసతి, ఉచిత భోజన సదుపాయాలే కాకుండా శివరాత్రికి ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మకు, శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం (పాతశివాలయం) స్వామి వార్ల రథోత్సవాన్ని సుమారుగా 155 ఏళ్లగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం వరకూ దుర్గమ్మ సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలను సైతం తమ సంస్థ ఆధ్వర్యంలో పూర్వీకులు నిర్వహించే వారని గుర్తు చేశారు. ఇప్పటికీ పాతశివాలయం శివరాత్రి ఉత్సవాలను తమ సంస్థే నిర్వహిస్తుందన్నారు.
పూర్తి ధార్మిక సంస్థగా
ఈ సంస్థ వ్యక్తిగతమైనది కాదని, పూర్తిగా ధార్మిక సంస్థగా కొనసాగుతుందన్నారు. ఆ భూమిని ఎవరికీ తమ సంస్థ అమ్మలేదన్నారు. ముఖ్యంగా ఆ భూమి వివరాలను దేవదాయ శాఖ 43 రిజిస్ట్రార్లో కొత్తగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలు తమ కమిటీని ఆశ్చర్యానికి లోను చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలకు తాము వివరాలను అందిస్తామన్నారు. సమావేశంలో కమిటీ ప్రముఖులు వల్లంకొండ ప్రసాద్, వీరమునిబ్రహ్మానందరావు, జగన్మోహనరావుగుప్తా, డొగిపర్తి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
150 ఏళ్లగా శ్రీ కన్యకాపరమేశ్వరి
అన్నసత్రం కమిటీ ఆధీనంలోనే