బీడీసీ రిటైనింగ్‌ వాల్‌ పనులపై మంత్రి అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

బీడీసీ రిటైనింగ్‌ వాల్‌ పనులపై మంత్రి అసంతృప్తి

May 31 2025 1:43 AM | Updated on May 31 2025 1:43 AM

బీడీసీ రిటైనింగ్‌ వాల్‌ పనులపై మంత్రి అసంతృప్తి

బీడీసీ రిటైనింగ్‌ వాల్‌ పనులపై మంత్రి అసంతృప్తి

– కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి నోటీసులు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గతేడాది బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతంలో రూ.23 కోట్లుతో నిర్మిస్తున్న రిటైనింగ్‌ వాల్‌ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి శాంతినగర్‌ వద్ద జరుగుతున్న సిమెంట్‌ కాంక్రీట్‌ పనులను అధికారులతో కలసి శుక్రవారం మంత్రి పరిశీలించారు. పనులు నత్తనడకన జరగడంపై కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మందకొడిగా పనులు సాగడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌ 10వ తేదీనాటికి ప్రధాన పనులు పూర్తి చేయాలని ఆదేశించినా కాంట్రాక్ట్‌ ఏజెన్సీ స్పందించక పోవడంపై మండిపడ్డారు. తక్షణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

కార్మికులను సొంత జిల్లాలకు పంపండి

చిలకలపూడి(మచిలీపట్నం): తెలంగాణ నుంచి వచ్చిన తొమ్మిది మంది ఏపీకి చెందిన వెట్టి చాకిరి కార్మికులను వారి సొంత జిల్లాలకు సురక్షితంగా పంపించాలని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి పెంట్లవల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని ఫిషింగ్‌ యూనిట్‌లో తొమ్మిది మంది వెట్టిచాకిరి చేస్తున్న (బాండెడ్‌) కార్మికులను ఏపీకి చెందినవారుగా గుర్తించారు. వారిని శ్రీకాకుళం, కృష్ణ, విజయ నగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కడప, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందినవారని తెలియజేస్తూ సర్టిఫికెట్లను జారీ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తీసుకొనివచ్చి అప్పగించారు. వారు శుక్రవారం ఉదయం కలెక్టర్‌ డీకే బాలాజీని కలిశారు. కలెక్టర్‌ వారందరితో మాట్లాడి కార్మికులను సొంత జిల్లాలకు పంపారు.

కల్తీ ఇంజిన్‌ ఆయిల్‌ వ్యాపారి అరెస్ట్‌

సూర్యాపేటటౌన్‌: కల్తీ ఇంజన్‌ ఆయిల్‌ తయారు చేసే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద సీసీఎస్‌, కోదాడ రూరల్‌ పోలీసులు తనిఖీలు చేస్తుండగా కల్తీ ఇంజన్‌ ఆయిల్‌ బాటిల్స్‌తో వ్యాపారి పట్టుబడ్డాడు. అతడిని విచారరణ చేయగా ఏపీలోని విజయవాడకు చెందిన కాకాని నాగ వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడు విజయవాడలోని ఓ ఇంజిన్‌ ఆయిల్‌ కంపెనీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేశాడు. ఇంజిన్‌ ఆయిల్‌ తయారీలో అనుభవం ఉన్న నాగ వెంకటేశ్వరరావు సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి ప్రముఖ కంపెనీలకు చెందిన ఆయిల్‌ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్స్‌, ప్లాస్టిక్‌ టిన్స్‌ తెప్పించాడు. విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్‌ ఫిల్టర్‌ చేసే వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో తన ఇంటి వద్దనే లీటర్‌ ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నింపి స్టిక్కర్లు అతికించి లీటర్‌ రూ.200 చొప్పున బైక్‌ మెకానిక్‌లకు విక్రయించడం ప్రారంభించాడు. 2007లో విజయవాడలోని తన ఇంటిలో కల్తీ ఇంజిన్‌ ఆయిల్‌ను బాటిల్స్‌లో నింపుతుండగా విజయవాడ వన్‌ టౌన్‌ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశాడు. రెండు రోజులు విజయవాడ జైల్లో ఉన్నాడు. తర్వాత వ్యాపారం బంద్‌ చేశారు. మళ్లీ కల్తీ ఇంజిన్‌ ఆయిల్‌ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయిల్‌ బాటిల్స్‌ను కారులో వేసుకుని నేరేడుచర్ల, మిర్యాలగూడ బైక్‌ మెకానిక్‌లకు అమ్ముతున్నాడు. శుక్రవారం ఉదయం కారులో కల్తీ ఇంజిన్‌ ఆయిల్‌ బాటిల్స్‌తో రామాపురం క్రాస్‌ రోడ్డు వద్దకు వస్తుండగా సూర్యాపేట సీసీఎస్‌ పోలీసులు, కోదాడ రూరల్‌ పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2లక్షల విలువైన ఆయిల్‌, కారును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్‌ సీఐ శివ, సిబ్బంది, కోదాడ రూరల్‌ సీఐ రజితరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement