
జగన్ సంక్షేమ సంతకం.. అన్నదాతల్లో ఆనందం
కంకిపాడులో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రిల్యాబ్
కాలువలకు మరమ్మతులు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జూన్ మొదటి, రెండు వారాల్లో సాగునీటిని ప్రధాన కాలువలకు విడుదల చేశారు. కాలువలు, బోర్ల సదుపాయంతో భూములను దుక్కి, దమ్ములు చేయించి నారుమడులు, ఇతర ఖరీఫ్ సాగు పనులు రైతులు చేసుకున్నారు.
రైతు భరోసా పథకం.. పెట్టుబడి సాయంగా ఖరీఫ్లోనే కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.13,500 విడతల వారీగా అందించి రైతులకు భరోసా ఇచ్చింది. 2019–24 వరకూ రూ.979.29 కోట్లు రైతు భరోసా కింద లబ్ధి చేకూరింది.
మేమున్నామన్న ధైర్యం.. మిచాంగ్ తుపానుతో పంట నష్టం వాటిల్లితే నిబంధనలను పక్కన పెట్టి దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేసింది. 1,64,849 మంది రైతులకు ఇన్పుట్సబ్సిడీగా రూ. 126.03 కోట్లు అందించింది. అంతే కాకుండా వివిధ విపత్తులతో జరిగిన నష్టానికి ఐదేళ్ల కాలంలో రూ 47.77 కోట్లు రైతులకు అందించిన పరిస్థితి.
రుణ సాయం.. సున్నావడ్డీ కింద రూ లక్ష లోపు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులు కృష్ణాజిల్లాలో 1.66 లక్షల మందికి రూ 30.23 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 30,405 మందికి రూ 7.72 కోట్లు లబ్ధి చేకూర్చింది.
చెంతకే సేవలు.. రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచం యావత్తూ రైతు సేవల గురించి చర్చించేలా, దేశంలోని వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా విధానాన్ని అమలు చేసింది. గ్రామ స్థాయిలో భరోసా కల్పించిందంటూ రైతులు గుర్తు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
జలకళ సాకారం.. వైఎస్సార్ జలకళతో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకీ సబ్సిడీతో కూడిన బోరు సదుపాయం కల్పించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అనేక గ్రామాల్లో జలకళ కింద బోర్లు ఏర్పాటయ్యాయి.
పక్కాగా పరీక్షలు.. నియోజకవర్గానికి ఒక అగ్రిల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మట్టి నమూనాతో పాటుగా విత్తన నాణ్యత, ఎరువుల, పురుగు మందుల నాణ్యత, చేపల మేత నాణ్యత పరిశీలన వంటి అనేక పరీక్షలు అందించింది. ఒక్కో ల్యాబ్ ద్వారా నెల నెలా 100 పరీక్షలకు తగ్గకుండా జరిగాయంటే వాటిని ఎంత సమర్థంగా అందుబాటులోకి తెచ్చిందో, రైతుల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుందో అర్థమవుతుంది.

జగన్ సంక్షేమ సంతకం.. అన్నదాతల్లో ఆనందం