
పైసలిస్తేనే పర్మిషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి పరిపాలనాపరమైన అన్ని కార్యకలాపాలు నిర్వహించే మచిలీపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అక్కడ నుంచి ఏ ఫైల్ కదలాలన్నా పైసలు చెల్లించాల్సిందేనని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ఏదైనా పర్మిషన్ల కోసం వెళితే ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఆ కార్యాలయ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు చెపుతున్నారు. అంతేకాదు ఇటీవల ఏఎన్ఎంలకు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఉద్యోగోన్నతులు ఇచ్చారు. వారికి ఇచ్చిన ఆర్డర్లు అసంపూర్తిగా ఉండటంతో వాటిని తీసుకుని రెండు మూడు రోజులు ఏఎన్ఎంల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం ఉద్యోగోన్నతుల సమయంలో ముడుపులు అడిగితే ఇవ్వకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారనే అని అంటున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ కృష్ణా డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది.
ప్రతి పనికీ ఓ రేటు...
● కృష్ణాజిల్లాలోని ఓ టీచింగ్ హాస్పిటల్లో మత్తు వైద్యుల సదస్సు జరగనుంది. ఆ సదస్సులో ఆల్ట్రాసౌండ్ స్కానర్ను ఉపయోగించి మత్తు ఇవ్వడంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆల్ట్రాసౌండ్ మిషన్ వినియోగించేందుకు డీఎంహెచ్ఓను అనుమతి కోరారు. అందుకు రూ.25 వేలు లంచం ఇస్తేనే అనుమతి ఇస్తామని కార్యాలయంలో తేల్చి చెప్పినట్లు తెలిసింది.
● గుడివాడలోని ఓ ట్రస్టు ఆధ్వర్యంలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆ హాస్పిటల్కు అనుమతి కోసం అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి అనుమతి కోసం డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ఫైల్ పంపారు. అనుమతి ఇవ్వాలంటే రూ.25 వేలు అధికారులు, రూ.5 వేలు కన్సల్టెంట్ గుమస్తాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డబ్బుల కోసం ఫైల్ పక్కన పడేశారు. ఈ రెండే కాదు జిల్లాలోని వైద్యశాఖ ఉద్యోగులకు సంబంధించి ఏ పనిచేయాలన్నా ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే పని చేయకుండా పక్కన పడేస్తున్నట్లు చెపుతున్నారు. ఇలా డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏఎన్ఎం ఉద్యోగోన్నతుల్లోనూ...
ఇటీవల సచివాలయాల్లో పనిచేస్తున్న 258 మందికి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. వాటి సచివాలయాల నుంచి వైద్యశాఖలో రిపోర్టు చేయాల్సి ఉంది. వారికి ఉద్యోగోన్నత ఉత్తర్వుల్లో రిలీవ్ ఎవరు చేయాలనే అంశం పేర్కొనక పోవడంతో గ్రామాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ రెండు రోజులు రిలీవ్ చేయలేదు. అసంపూర్తిగా ఆర్డర్లు ఇవ్వడం వలనే అలా జరిగిందని ఏఎన్ఎంలు మండి పడుతున్నారు. ఏప్రిల్ 26న ఒకసారి కౌన్సెలింగ్ నిర్వహించారని ఆ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామనే అక్కసుతోనే తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఏప్రిల్లో నిర్వహించిన కౌన్సెలింగ్లో ఉద్యోగోన్నతులు పొందిన 15 మందికి ప్రస్తుతం కౌన్సెలింగ్లో రాలేదు. దీంతో వారు కూడా ఆందోళనకు దిగడంతో పాటు, కృష్ణా కలెక్టర్కు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
అవినీతి ఊబిలో కూరుకుపోయిన కృష్ణా డీఎంహెచ్ఓ కార్యాలయం ఏఎన్ఎంల ఉద్యోగోన్నతుల్లోనూ అసంపూర్తిగా ఆర్డర్లు మూడు రోజులు కార్యాలయాల చుట్టూ తిరిగిన ఏఎన్ఎంలు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్ఓ
నా దృష్టికి రాలేదు
తమ కార్యాలయంలో డబ్బులు అడుగుతున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అనుమతుల కోసం ఎవరినీ డబ్బులు అడగడం లేదు.
– డాక్టర్ శర్మిష్ట, డీఎంహెచ్ఓ, కృష్ణా