
ఇష్టం లేకపోతే బయట పని చూసుకోండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేశఖండనశాలలో సిబ్బంది పని తీరుతో దేవస్థానానికి చెడ్డ పేరు వస్తే క్షమార్హం కాదు.. సేవా దృక్పథం ఉండాలి...లేనప్పుడు బయట వేరే పనులు చూసుకోండి.. భక్తుల నుంచి ఫిర్యాదులోస్తే అదే రోజు ఉద్యోగం నుంచి బయటకు పంపడమే కాదు పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తాం...ఉద్యోగం లేని రోజు.. ఎలా ఉంటుందో ఊహించుకోండని దుర్గగుడి ఈవో శీనానాయక్ హెచ్చరించారు. మహా మండపం ఆరో అంతస్తులో దుర్గగుడి కేశ ఖండనశాల సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. భక్తులను ఇబ్బంది పెడితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శనివారం రెండు వీడియో ఫిర్యాదులు తన వద్దకు వచ్చాయని, దేవదాయ చట్టం ప్రకారం నిబంధనలు కఠినంగా ఉన్నాయని, భక్తులను ఇబ్బంది పెట్టే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కేశఖండనశాలలో సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు, వేతనాల సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదులపై అన్ని కోణాల్లో విచారిస్తామని, సిబ్బంది తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవని స్పష్టం చేశారు.
భక్తులను గౌరవిస్తే ఆలయానికి మంచిపేరు
ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రతిచోట భక్తులను గౌరవించాలని, ఆప్యాయతను చూపిస్తే ఆలయానికి మంచి పేరు వస్తుందని ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈవో సూచించారు. దాదాపు నెల రోజుల నుంచి సెక్యూరిటీ సిబ్బందిని గమనిస్తున్నానని, యాంత్రికంగానే ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. దుర్గాఘాట్లో విచ్చలవిడిగా షాంపులు, సబ్బులు వాడుతూ నది పవిత్రతను దెబ్బతీస్తున్నా సెక్యూరిటీ సిబ్బందిగాని, శానిటేషన్ సిబ్బంది గాని అడ్డు చెప్పడం లేదన్నారు. భక్తులు ఎన్నో బాధలతో వస్తుంటారని, వారితో మర్యాదగా, గౌరవంగా మాట్లాడి దర్శనం, ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం అందేలా చూస్తే వారు ఎంతో సంతోషిస్తారన్నారు. కొండపై సెల్ఫోన్లతో భక్తులు ఇష్టానుసారం ఫొటోలు దిగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బంది ఉన్న ఆలయంలో భక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కొంతమంది తీరుతో దేవస్థానం చెడ్డ పేరు వస్తుందన్నారు. ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ఇష్టం లేకపోతే బయట పని చూసుకోండి

ఇష్టం లేకపోతే బయట పని చూసుకోండి

ఇష్టం లేకపోతే బయట పని చూసుకోండి