
త్యాగానికి ప్రతీక బక్రీద్
మచిలీపట్నం టౌన్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వ దినాన్ని నగరంలోని ముస్లింలు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువులు బక్రీద్ పర్వదినం విశిష్టతను వివరించారు. బక్రీద్ రోజున ముస్లింలు పేదలకు మాంసాన్ని దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత మరో ప్రధానమైన పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఎదుటి వారికి సాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని కోరారు. ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగ నాయకుడు ఎండీ సద్రుద్దీన్, టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు ఇలియాస్పాషా, సయ్యద్ఖాజా తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): త్యాగనిరతిని, దాన గుణాన్ని పెంపొందించేదే బక్రీద్ పండుగ అని జమాతే ఇస్తామీ హింద్(జేఐహెచ్) మహమ్మద్ రఫీక్ అహ్మద్ అన్నారు. లబ్బీపేట ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం బక్రీద్ సామూహిక నమాజు జరిగింది. వేలాది మంది ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ ఇంటిల్లిపాదీ జరుపుకునే పండుగలో బీదలు, బంధువులను, ఇరుగుపొరుగువారిని భాగస్వాములుగా చేసుకుని, మీకున్నంతలో దానమివ్వాలని ఇస్లాం చెబుతోందన్నారు.
బందరులో మసీదులు, ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

త్యాగానికి ప్రతీక బక్రీద్