
చల్లపల్లి వీధుల్లో అంకినీడు అంతిమ యాత్ర
చల్లపల్లి: శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్(చల్లపల్లి రాజా)వారి కుమారుడు అంకినీడు ప్రసాద్(86) భౌతిక కాయం శనివారం సాయంత్రానికి చల్లపల్లికి చేరుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులోని స్వగృహంలో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. చల్లపల్లి ప్రధాన రహదారులపై పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అంకినీడు ప్రసాద్ భౌతిక కాయాన్ని ఊరేగించారు. ఆటోనగర్ వద్ద తరిగోపుల ప్రాంగణం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర ప్రధాన రహదారి వెంబడి అవనిగడ్డ వైపు ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద వరకు వెళ్లి అక్కడ నుంచి వెనుదిరిగి మచిలీపట్నం రోడ్డులోని శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్(ఎస్ఆర్వైఎస్పీ) కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం రెండు గంటల పాటు అక్కడ ఉంచారు. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి నివాళులు అర్పించారు. అనంతరం అదే వాహనంలో ఆయన భౌతికకాయాన్ని మచిలీపట్నంలోని శివగంగ ప్రాంగణానికి తరలించారు. అంకినీడు ప్రసాద్ భౌతికకాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి సింహాద్రి రమేష్బాబు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
కడసారి వీక్షించేందుకు బారులు తీరిన ప్రజలు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మండలి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల

చల్లపల్లి వీధుల్లో అంకినీడు అంతిమ యాత్ర