
యోగాభ్యాసంతో మానసిక వికాసం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాంధ్ర మహోత్సవంలో భాగంగా విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం 18వ రోజు యోగాసనాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. యోగా ఔత్సాహికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, అర్బన్ పీహెచ్సీల వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లాలో కనీసం పది లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్దఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
8వ తేదీ బెరంపార్కులో...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని యోగాసనాలు సాధన చేయాలని కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం కృష్ణానదీ తీరంలోని బెరం పార్కులో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ఎం.సుహాసిని, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త జె.సుమన్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, ఆయుష్ అధికారి రామత్లేహి, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు, శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 8న హరిత బెరం పార్కులో ప్రత్యేక యోగాసనాల కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ