
ప్రతి ఒక్కరూ యోగా చేయాలి
చిలకపూడి(మచిలీపట్నం): ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్నారు. ప్రతిరోజూ ఉదయమే యోగాతో దైనందిన కార్యక్రమాలను సజావుగా చేసుకోవచ్చన్నారు. గ్రామాలు, మండలాల్లో ఆ మేరకు యోగా ట్రైనర్లు నిరంతరం యోగ శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్రలో పేర్ల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాధారణ యాప్తో పాటు వాట్సాప్ ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా పేర్ల నమోదు కార్యక్రమం చేయడానికి అవకాశం లభించిందన్నారు. జిల్లాలో 17.39 లక్షల మంది ఉండగా ఇందులో ఇప్పటివరకు 7.59 లక్షల మంది సర్వే పూర్తైందన్నారు. అందులో 3.38 లక్షల మంది యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. గ్రామస్థాయిలో జరిగే యోగా పోటీలు పూర్తవుతాయన్నారు. వాటిని అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం రెండు రోజులపాటు మండల స్థాయిలో యోగా పోటీలు జరగనున్నాయన్నారు. వీటిని ప్రణాళిక బద్ధంగా నిర్వహించడానికి అందరూ సంసిద్ధం కావాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు గుడివాడ మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, మనోహర్, మండల ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద కుమారు, డీటీడబ్ల్యూవో ఫణి ధూర్జటి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ బాలాజీ