మైలవరం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం రోజు రోజుకూ శ్రుతి మించుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అధికారమే అండగా దాడులకు తెగబడుతున్నారు. ఉపాధి కూలీలను కులం పేరుతో దూషిస్తూ మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన పొందుగలలో జరిగింది. మైలవరం మండలం పొందుగల గ్రామం దళితవాడకు చెందిన ఉపాధి హామీ కూలీలు స్థానికంగా ఉన్న చెక్ డ్యామ్ వద్ద ఉపాధి పనులు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడి అనుచరులు ఆరేపల్లి సత్యనారాయణ, నాగరాజు, గోపాలరావు వచ్చి ‘ఇక్కడ పనిచేయవద్దు మేము చెప్పిన చోట పనులు చేయాలని’ వారిపై ఒత్తిడి చేశారు. ‘మేము చెప్పిన చోట పనులు చేయకపోతే కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా చేస్తా మంటూ’ బెదిరించారు. మేము ఫీల్డ్ అధికారి చెప్పిన చోట పనిచేస్తామని ఉపాధి కూలీలు తేల్చి చెప్పడంతో కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ వివాదాన్ని ఫోన్లో చిత్రీకరిస్తున్న మహిళ వద్ద ఫోన్ లాక్కుని మరీ దాడి చేశారు. దాడిలో ఉపాధి కూలీలు సుష్మ, కమలమ్మ అనే మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఘటనలో నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో బాధిత ఉపాధి కూలీలు శుక్రవారం నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
తాము చెప్పిన చోటే పని
చెయ్యాలంటూ దౌర్జన్యం
కులం పేరుతో దూషిస్తూ దాడి
ఫిర్యాదు చేసినా చర్యలు
తీసుకోని పోలీసులు
ఉపాధి కూలీలపై ‘తమ్ముళ్ల’ దాడి