
కేటుగాళ్లు రూటు మార్చారు
విజయవాడ స్పోర్ట్స్: గంజాయిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ మార్గంలో అది విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చేరుతూనే ఉంది. సరుకు, ప్రజా రవాణాపైనే నిఘా నేత్రం దృష్టి సారిస్తున్న ప్రస్తుత తరుణంలో గంజాయి అక్రమ రవాణాకు కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు.
ఈ ప్రాంతాలే టార్గెట్
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు ముందుగా బైక్లను చోరీ చేస్తున్నారు. విజయవాడలోని రద్దీ ప్రాంతాలు, రాత్రి సమయంలో రోడ్లపైనే పార్కింగ్ చేసి ఉండే ప్రాంతాల్లో, ఆస్పత్రుల వద్ద బైక్లను చోరీ చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్స్టేషన్, రైల్వే స్టేషన్, కొత్త, పాత ప్రభుత్వాస్పత్రి, కొండ సమీపంలోని నివాసాల వద్ద ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కృష్ణలంక, భవానీపురం, కొత్తపేట, మాచవరం, సత్యనారాయణపురం, పోలీస్ స్టేషన్ల్లో ఈ దొంగతనాలు అధికంగా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గడచిన ఏడాదిలో 185 బైక్ చోరీ కేసులు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి.
సిండికేట్గా మారి..
చోరీ ముఠా మొత్తం సిండికేట్గా మారి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధానంగా విజయవాడకు చెందిన కట్టా శ్రీను ఇక్కడ బైక్లను చోరీ చేసే ముఠాకు నాయకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. బైక్ చోరీ చేసిన వ్యకి..ఒడిశాకు చేరుకునే మార్గాన్ని ఇతనే దిశానిర్దేశం చేస్తాడు. ఒడిశాకు చేరుకున్న తర్వాత చోరీ చేసిన బైక్ను నరసింహులు అనే వ్యక్తి కొనుగోలు చేసి నగదు ముట్టజెబుతాడు. ఆ తర్వాత రమేశ్ అనే వ్యక్తి నేరగాళ్లకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో రమేష్ గంజాయి విక్రయించడంతో పాటు విజయవాడలోనూ తన ముఠాతో యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితులపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు
గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తులు బైక్లను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నాం. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఏడాదిలో 185 బైక్లు చోరీకి గురవ్వగా 130 బైక్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన నిందితులు కట్టా శ్రీను, నరసింహులు, రమేశ్తో పాటు మరికొందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై పిట్ ఎన్డీపీఎస్(ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్స్) యాక్ట్ను ప్రయోగిస్తున్నాం. ఈ కేసులో అరెస్ట్ అయితే ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ బైక్కు జీపీఎస్ ట్రాకర్ను అమర్చుకోవాలి. దీంతో బైక్ చోరీకి గురైన వెంటనే ట్రాకర్ సాయంతో గుర్తించడానికి వీలుంటుంది.
– రాజశేఖరబాబు
పోలీస్ కమిషనర్, విజయవాడ
ఒడిశాలో అమ్మేస్తున్నారు
విజయవాడతో పాటు నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లో చోరీ చేసిన బైక్లపై నేరగాళ్లు నేరుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)కి చేరుకుంటున్నారు. విజయవాడలోనే సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒడిశాలోకి ప్రవేశించి, అక్కడ వాహనాన్ని అమ్మేస్తున్నారు. వచ్చిన నగదులో కొంత జల్సాలు చేసి మిగిలిన నగదుతో అక్కడే గంజాయిని కొనుగోలు చేసి, పలు రవాణా మార్గాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. ఒక్కో నిందితుడు గరిష్టంగా 5 కేజీల గంజాయిని తీసుకొస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తీసుకువచ్చిన గంజాయిని ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్నారు. బైక్లతో పాటుగానే మొబైల్ ఫోన్లనూ ఈ ముఠా చోరీ చేసి ఒడిశాలో విక్రయించి, ఆ సొమ్ముతో గంజాయి కొని తీసుకొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో బైక్లు చోరీ
ఆ నగదుతో ఏవోబీలో
గంజాయి కొనుగోలు
పాత నేరస్తుల ఆధ్వర్యంలో దందా

కేటుగాళ్లు రూటు మార్చారు

కేటుగాళ్లు రూటు మార్చారు