
మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగం జరగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి సాగు చేయకుండా పర్యవేక్షించాలని, గంజాయి సాగు చేసేవా రిని గుర్తించి పథకాల లబ్ధిని నిలిపివేయాలన్నారు. పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యా సంస్థల సమీపంలోని కిరాణాలు, పా న్ షాపులపై నిఘా ఉంచాలన్నారు. సరిహద్దు రా ష్ట్రం నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలన్నా రు. ఈ నెల 26న అంతర్జాతీయ డ్రగ్స్డే సందర్భంగా జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు వి ద్యార్థులు, మహిళా సంఘాలతో ర్యాలీలు నిర్వహించాలని, నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంతకు ముందు ఎస్పీ మాట్లాడుతూ వచ్చే రెండు నెలల్లో పోలీసు కళాజాత బృందాలతో జిల్లావ్యాప్తంగా ప్రతీ సోమ, గురువారాల్లో మాదకద్రవ్యాల నిర్మూలనపై కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, డీఐఈవో కళ్యాణి, రవాణా అధికారి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.