
భూభారతితో సమస్యలు పరిష్కారం
ఆసిఫాబాద్: భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహనిర్మాణ శాఖ, మిషన్ భగీ రథ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అర్హుల జాబితా, ఎంపిక, తాగునీటి సరఫరా అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర మంత్రులతో కలిసి హైదరాబాద్లో సమీ క్షా సమావేశం నిర్వహించారని తెలిపారు. నూతన భూభారతి చట్టంలోని అంశాలపై అధికారులకు అ వగాహన ఉండాలని సూచించారు. పైలట్ గ్రామాల్లో నమూనా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇతర గ్రామాల్లో అర్హుల జాబితాను ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అత్యంత పేదవారిని గుర్తించి వారికి ప్రాధాన్యతనివ్వాలని, అనర్హులు జాబితాలో లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కలెక్షన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలకు వాటర్ ట్యాంకులు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చర్యలు చేపట్టాలన్నారు. పైప్లైన్ లేని గ్రామాలను గుర్తించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే