● కొత్త విద్యాసంవత్సరానికి గురుకులాలను సిద్ధం చేయాలి ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షిప్రతినిధి, ఖమ్మం: విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ భారీగా నిధులు కేటాయిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే, ఉద్యోగుల వేతనాలు, డైట్ చార్జీలు, అద్దె క్రమం తప్పకుండా చెల్లిస్తుండడం, భవనాల మరమ్మతులకు నిధులు కూడా విడుదల చేస్తున్న నేపథ్యాన క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పోలీసు కమిషనర్ సునీల్ దత్, సంబంధిత అధికారులతో గురుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థలపై సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా సీట్లు మిగిలితే అధ్యయనం చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వచ్చేనెల 12న కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుండగా అన్ని వసతులతో విద్యాసంస్థలను సిద్ధం చేయాలని, అవసరమైన మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని తెలిపారు.
పాఠశాలలను తనిఖీ చేయాలి..
ప్రతీ రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ చార్జీలు, మెనూ వివరాలను ప్రదర్శించాలని భట్టి సూచించారు. అంతేకాక గురుకుల విద్యాసంస్థలకు జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించి ప్రతీ నెల తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని తెలిపారు. వైద్యులు కూడా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఎన్నింటిని యంగ్ ఇండియా పాఠశాలల్లోకి తరలించవచ్చో కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.


