ఖమ్మంఅర్బన్: జిల్లా జల వనరుల శాఖ ముఖ్య ఇంజనీర్(సీఈ)గా మంగళపూడి వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు, జలవనరుల శాఖ ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్, ఇరిగేషన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్తో పాటు నాగేశ్వరరావు, రర్ లెనిన్, బీబు సాహెబ్, భీముడు, చారి, వెంకట్రావు, గోపయ్య, శ్రీనివాసరావు, సంధ్యారాణి, వీణాకుమారి, జి.శ్రీనివాసరావు, హిమబిందు, రవితేజ, రాజ్యలక్ష్మి, అర్జున్, ముత్యాల దేవి, ప్రసాద్, రామయ్య, సుదర్శనం తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
15వ ఆర్థిక సంఘం
నిధులు విడుదల
జాబితాలో కేఎంసీతో పాటు వైరా, ఇల్లెందు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీతోపాటు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు మున్సిపాలిటీకి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.6,38,97,777 నిధులు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో టైడ్, అన్టైడ్ నిధులుగా విభజించారు. టైడ్ గ్రాంట్లలో 50 శాతం వర్షపునీటి నిల్వ, రీసైక్లింగ్తో తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుంది. అన్టైడ్ నిధుల్లో 50 శాతం ఆయా ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. కాగా, ఖమ్మం కార్పొరేషన్కు రూ.4,91,14,895 నిధులు కేటాయించగా, ఇందులో టైడ్ నిధులు రూ.2,94,68,937, అన్టైడ్ నిధులు రూ.1,96,45,958 ఉన్నాయి. అలాగే, వైరా మున్సిపాలిటీకి రూ.74,53,356 మంజూరు చేశారు. ఇందులో టైడ్ నిధులు రూ.44,72,014, అన్టైడ్ నిధులు రూ.29,81,342గా వెల్లడించారు. ఇక ఇల్లెందు మున్సిపాలిటీకి రూ.73,29,526 నిధులు మంజూరు చేయగా.. టైడ్ నిధులు రూ.43,97,716, అన్టైడ్ నిధులు రూ.29,31,810 ఉన్నాయి.
విద్యుత్ పనుల్లో భద్రతా పరికరాలు తప్పనిసరి
ఖమ్మంవ్యవసాయం: క్షేత్ర స్థాయిలో పనులు నిర్వహించే ప్రతీ విద్యుత్ ఉద్యోగి తప్పక భద్రతా పరికరాలు ధరించాలని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆదేశించారు. ప్రధానంగా హెల్మెట్, గ్లౌజ్లు, ఎర్త్ రాడ్ వంటి పరికరాలు లేకుండా పనిచేయొద్దని బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేసినా కొందరు పరికరాలు ఉపయోగించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈమేరకు నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ఆయన.. భద్రతా చర్యల్లో భాగంగా ఎల్సీ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


