ఖమ్మంక్రైం: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న పలువురు హెడ్కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి పొందారు. ఈమేరకు రవీంద్రనాధ్, ప్రకాష్రావు, శ్రీనివాస్ భద్రాద్రి జిల్లాకు బదిలీపై వెళ్తుండగా సీపీ సునీల్దత్ సోమవారం అభినందించారు. అలా గే, వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించారు.
ఈసీఆర్ ఒత్తిడి తగ్గించాలి
ఖమ్మం సహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమంతో ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా చిన్నపాటి కారణాలతో షోకాజ్ నోటీసులు జారీచేసి ఒత్తిడికి గురి చేయడం సరికాదని టీఎస్ యూటీయఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇకనైనా ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని వారు సోమవారం డీఈఓ చైతన్య జైనీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నచిన్న తప్పిదాలకు ఉపాధ్యాయులను నెలల తరబడి సస్పెండ్ చేయడం, వేతనంలో కోత విధించడం వంటి చర్యలు మానుకోవాలన్నారు. అలాగే, ఒంటిపూట బడి సమయాన మధ్యాహ్నం 1–30వరకు పనిచేయాలని పెనుబల్లి మండల అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. కాగా, పదో తరగతి మూల్యాంకన విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు 2022, 2023 – 2025 బకాయిలు చెల్లించపోతే ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు వల్లంకొండ రాంబాబు, సురేష్, రామకృష్ణ, కే.వీ.మురళీకృష్ణ, బి.రమేష్ పాల్గొన్నారు.
మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడి
ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికలకు ముందు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ సమావేశాల్లో రూ.18 వేల వేతనం ప్రకటించాలనే డిమాండ్తో సోమవారం ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎన్జీవోస్ భవనం నుండి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు మంత్రి కార్యాలయం వద్ద చేరుకోగా, లోనకు వెళ్లకుండా టూటౌన్ పోలీసులు బారికేడ్లు అమర్చారు. అయినా ఆశా కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు లోనకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18వేల వేతనం ప్రకటించడంతో పాటు రూ.50 లక్షల బీమా, ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నింటి రమ్య, ఎస్.నవీన్రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్టీయూ ఆధ్వర్యాన...
ఖమ్మంవైద్యవిభాగం: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీవై.పాషా డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆశా కార్యకర్తలు పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించడమే కాక బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు శైలజ, సులోచన, సుమతి, కవిత, నాగమణి, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


