ఖమ్మంవ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సోమవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. గేటుకారేపల్లిలో 2.8మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, కామేపల్లి మండలం లింగాల, రఘునాథపాలెం, ఖమ్మంలోని ప్రకాష్నగర్, శ్రీనివాసనగర్, సుందరయ్యనగర్, వ్యవసాయ మార్కెట్ తది తర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మొక్కజొన్న, వరి, మిర్చి కోతలు జోరుగా సాగుతున్నాయి. దీంతో కోసిన పంటపై టార్పాలిన్ పట్టాలు కప్పుతూ రక్షించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా సోమవారం పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37.1, కనిష్టంగా 33.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల్లో 40 డిగ్రీలకు చేరే అవకాశముందని తెలుస్తోంది. కాగా, వేంసూరు మండలంలోని మర్లపాడు, కందుకూరు తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో వడ్లగండ్ల వర్షం కురవడంతో మొక్కజొన్న పంట నేలవాలింది.
అన్నదాతల్లో గుబులు


