వైరా: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా లాభాలు సాధించొచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈమేరకు సోమవరం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ వీక్షించాక డీఏఓ పుల్లయ్య మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించొచ్చని తెలిపారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు కిట్లు అందజేశారు. ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓలు మేడా రాజేష్, వెంపటి కీర్తి, ఆలూరి వాసంతి, పరిటాల వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
చైనా గ్రానైట్ ఎగ్జిబిషన్లో రాయల
నేలకొండపల్లి: గ్రానైట్ పరిశ్రమల్లో నూతన యంత్రాలపై చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లో చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమల రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పలువురు వ్యాపారులతో కలిసి చైనాలోని జియామిన్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతనమైన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు.
సాగునీరు విడుదల చేయండి
పెనుబల్లి: పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు ఆయకట్టులో పంటల సాగుకు ఇబ్బంది ఎదురుకాకుండా నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్టులో బోటు షికారు కోసం నీటి విడుదల నిలిపివేశారని, తద్వారా వేయి ఎకరాల్లో వరి పంట ఎండిపోతోందని రైతులు ఇటీవల ఆందోళన చేశారు. ఈమేరకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. ఆయకట్టు రైతుల ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే నీరు విడుదల చేయాలని సూచించారు.
భూదాన్ నిర్వాసితులకు అండగా 22న ఖమ్మం బంద్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండ్తో ఈనెల 22న ఖమ్మం నగర బంద్కు పిలుపునిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు తెలిపారు. ఖమ్మంలో మంగళవారం ఆయన ఆయన మాట్లాడుతూ భూదాన్ భూముల్లో 700 ఇళ్లకు పైగా కూల్చివేసిన ప్రభుత్వం 311 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఇంకా అనేక మంది అర్హులు ఉన్నందున అందరికీ న్యాయం చేయాలనే డిమాండ్తో చేపడుతున్న బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, నాయకులు మందుల రాజేంద్రప్రసాద్, వెంకట్రాంరెడ్డి, వై.ప్రకాష్, ఖాసిం, గిరి, సురేష్, లక్ష్మి, గొర్రిపాటి రమేష్, సుదర్శన్, మోహన్రావు, జానకి, మస్తాన్ పాల్గొన్నారు.
నిర్వాసితులందరికీ స్థలాలు ఇవ్వాల్సిందే..
ఖమ్మంఅర్బన్: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని భూదాన్ ఇళ్ల స్థలాల సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మాస్లైన్ నాయకులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తొలిదశలో ఇళ్లు ఇచ్చిన 311 మందిలో అనర్హులు ఉన్నందున పరిశీలించి నిజమైన బాధితులకే స్థలాలు కేటాయించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. నాయకులు సత్యనారాయణరెడ్డి, సీవై.పుల్లయ్య, ఆవుల అశోక్, కోటేశ్వరరావు, ఝాన్సీ, కె.నాగేశ్వరరావు, ఎం.నాగేశ్వరరావు, ఆవుల మంగతాయి, శోభ, ఉమ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


