● మీడియేటర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ● జిల్లా జడ్జి రాజగోపాల్
ఖమ్మం లీగల్ : మధ్యవర్తిత్వం ద్వారానే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ అన్నారు. మీడియేటర్లు నిష్పక్షపాతంగా, గోప్యంగా వ్యవహరించాలని సూచించారు. ఖమ్మం న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు నిర్వహించిన 40 గంటల మీడియేషన్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్ మాట్లాడుతూ.. కోర్టుల్లో పెరుగుతున్న పెండింగ్ కేసుల దృష్ట్యా మీడియేషన్ ద్వారా ఇరు పక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవడం కీలకమని అన్నారు. మీడియేషన్లో ఇరు పక్షాలు స్వచ్ఛందంగా పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మీడియేషన్కు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ను రిసోర్స్ పర్సన్లు అరుణాచలం, విజయకమల, శశిదేవి, రత్నతార సమర్థంగా తరగతులు నిర్వహించారని అభినందించారు. అనంతరం తర్ఫీదు పొందిన న్యాయవాదులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి అపర్ణ, న్యాయమూర్తులు అర్చనకుమారి, రాంప్రసాదరావు, సీనయ్య, శివరంజని, మురళీమోహన్, దీప, రజని, బిందుప్రియ, నాగలక్ష్మి, అఖిల, న్యాయసేవా సదన్ కార్యదర్శి ఎం.కల్పన తదితరులు పాల్గొన్నారు.


