అటకెక్కిన ఆహ్లాదం.. పనుల్లో జాప్యం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి శివారులో రూ.3కోట్లతో ఏర్పాటుచేసిన జలగం వెంగళరావు పార్క్ను 2008 జనవరి 27న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తొలుత పూలమొక్కలు నాటడమే కాక ఎల్ఈడీ ప్రొజెక్టర్తో చిత్రాల ప్రదర్శనతో నిత్యం సందడిగా ఉండేది. కాలక్రమంలో నిర్వహణ లోపించి పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో అడవిని తలపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పట్టణ ప్రగతి వనాలు, ఓపెన్ జిమ్ల పరిస్థితి అలాగే తయారైంది. తామరచెరువు, వేశ్యకాంతాల చెరువులను ట్యాంకుబండ్లుగా అభివృద్ధి చేసే పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడంలేదు. తామర చెరువు వద్ద నిర్మించిన ఫ్రీడమ్ పార్కు పనుల్లో నాణ్యత లోపించి ఆదరణ దక్కడం లేదు. మొత్తంగా 90 మంది పారిశుద్ధ్య కార్మికులే ఉండడంతో చెత్త సేకరణ సాఫీగా సాగడం లేదు. ఇవన్నీ కాక వీధి కుక్కలు, కోతుల స్వైరవిహారంతో స్థానికులు అవస్త పడుతున్నారు. వేంసూరు రోడ్, గుడిపాడు రోడ్, కాకర్లపల్లి రోడ్, సిద్ధారం రోడ్లలో డివైడర్ల ప్రతిపాదన ఉన్నా కార్యారూపం దాల్చడం లేదు. అంతేకాక పలు కాలనీల్లో అంతర్గత వీధులు గుంతలమయంగా మారడంతో పాటు డ్రెయినేజీలు లేక మురుగునీరు రహదారిపైకి చేరుతోంది. ఇవికాక తాగునీటి పైపులైన్ లీకేజీలు అరికట్టడమే కాక పట్టణంలో అన్ని వీధులకు పేర్లు, రోడ్ నంబర్లు సూచించే బోర్డులు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది.


