రహదారులు లేవు.. డివైడర్లూ అంతే..
కల్లూరురూరల్: కల్లూరులో ఏడు గ్రామపంచాయతీలు విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటుచేయగా అనేక సమస్యలు కొలువయ్యాయి. మూడేళ్ల క్రితం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు స్తంభాలు వేసి, వైరింగ్ చేసినా పనులు పూర్తికాలేదు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రూ.1.80 కోట్లతో డివైడర్ల నిర్మాణానికి ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు. డంపింగ్ యార్డు లేక సాగర్ కాల్వ పక్కనే వేస్తున్నారు. ఇది పరిసర ప్రాంతాల వారికి అసౌకర్యంగా ఉన్నందున శాశ్వత డంప్ యార్డును గుర్తించాలి. మన్సిపాలిటీ కేంద్రంతో పాటు విలీన గ్రామాలైన పుల్లయ్యబంజరు, కప్పలబంధం, కిష్టయ్యబంజరు, పడమరలోకవరం, వాత్యానాయక్ తండా, జీడిపిపల్లెలో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణానికి రూ.6.92 కోట్లతో చేసిన ప్రతిపాదనలు కాగితాల్లోనే మూలుగుతున్నాయి. మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, గత 20ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన పైపులు పాడవడంతో తాగునీటి సమస్య నెలకొంది.


