‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’పై దృష్టి పెట్టాలి
అందుబాటులో 12,682 మె.ట. యూరియా
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంసహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఆయన వీసీ ద్వారా ఎంఈఓలు, హెచ్ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల్లో పఠనా సామర్థ్యం పెంపునకు చేపట్టిన ఈ కార్యక్రమం మొదటి దశలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల కారణంగా మధ్యలో కొంత ఆగినా నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంగా రెండో దశ అమలుకు కృషి చేయాలని సూచించారు. మొదటి దశలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రెండు రకాల స్టడీ మెటీరియళ్లు సిద్ధం చేశామని, వెనుకబడిన విద్యార్థులు ప్రగతి సాధించేలా చూడాలని అన్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎఫ్ఎల్ఎన్ సర్వేలో జిల్లా నుంచి మంచి పురోగతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.
లైంగిక వేధింపుల నిరోధక చట్టం
అమలు చేయాలి
లైంగిక వేధింపుల నిరోధక చట్టం కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పోష్ యాక్ట్ –2013 పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని నేరంగా పరిగణించాలన్నారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది పని చేసే కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందులో 50 శాతం మహిళలు ఉండాలని సూచించారు. నెల రోజుల్లో కమిటీలు ఏర్పాటు చేయకుంటే సంబంధిత బాధ్యులకు రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఫ్లాగ్ షిప్ వివరాల అప్డేట్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలు మొదలైన వివిధ కార్యక్రమాల అమలు వివరాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్ణీత గూగుల్ షీట్ ప్రొఫార్మాలో ప్రతి శుక్రవారం అప్ డేట్ చేయాలని ఆదేశించారు. పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను జనవరి 9 వరకు డిస్పోజ్ చేయాలని సూచించారు. ప్రజావాణిలో 31 సర్వే ల్యాండ్ రికార్డ్స్ దరఖాస్తులు పెండింగ్ ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతకానిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు మూడెకరాల స్థలం గుర్తించాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీఈఓ చైతన్య జైనీ, సీఎంఓ ప్రవీణ్ కుమార్, డీఆర్ఓ ఎ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమాధికారిణి వి. విజేత, డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లాలో ప్రస్తుతం 12,682 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అన్ని మండలాల్లో రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. యూరియా విక్రయ కేంద్రాల వద్ద టెంట్, కుర్చీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, రైతులు టోకెన్లు పొంది యూరియా తీసుకెళ్తున్నారని తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 185 కేంద్రాల్లో యూరియా పంపిణీ చేసినట్లు వెల్లడించారు.


