ఆ పంచాయతీలు.. ‘చే’జిక్కేదెలా..?
నియోజకవర్గాల వారీగా గ్రామ పంచాయతీల
వివరాలు..
అభివృద్ధి, సంక్షేమ అస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్
● మెజార్టీ పంచాయతీలు మద్దతుదారులకు దక్కేలా ప్రణాళిక ● గెలుపు కోసం ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యూహరచన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలతోపాటు తమకు పట్టున్న చోట మద్దతుదారుల గెలుపు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక పంచాయతీలను కై వసం చేసుకునేందుకు ముగ్గురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కొంత బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అత్యధిక పంచాయతీల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కొన్నిచోట్ల బీఆర్ఎస్తో కలిసి సీపీఎం, మరి కొన్నిచోట్ల సీపీఎంతో సీసీఐ జత కడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు విడతల్లో జరిగే పంచాయతీల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, వామపక్షాలు కై వసం చేసుకున్న పంచాయతీలను ఈసారి ‘చే’జిక్కించుకోవాలని మండల స్థాయి నాయకత్వాన్ని ఆదేశించింది.
సత్తా చాటాల్సిందే..
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఓటు బ్యాంక్ ఉంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మూడుసార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్నే బలపరిచారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చుక్కెదురవుతోంది. గత స్థానిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పట్టు సాధించింది. అప్పుడు బీఆర్ఎస్తో పాటు సీపీఎం, సీపీఐ కూడా బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆ సీన్ మారింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతోపాటు జిల్లాలోనూ పూర్తి ఆధిపత్యం కాంగ్రెస్దే. ఈ క్రమంలో జీపీ ఎన్నికల్లోనూ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.
మంత్రులు, ఎమ్మెల్యేల డైరెక్షన్లో..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ను బుజ్జగించడం, అభ్యర్థుల ప్రచారం తదితర అంశాలన్నీ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేల సూచనలతోనే సాగుతున్నాయి. మొత్తం 566 గ్రామ పంచాయతీల్లో ఎక్కువ స్థానాలను చేజిక్కించుకుని జిల్లాలో పార్టీకి తిరుగులేదని మరోసారి నిరూపించేలా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టుదలతో ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి వారి నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. మండల కేంద్రాలు, మేజర్ జీపీలతో పాటు గత ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలు గెలిచిన పంచాయతీలపై దృష్టి పెట్టారు. అయితే ఏకగ్రీవం.. లేదంటే పోటీలో నెగ్గేలా చూడాల్సిన బాధ్యతలను మండల స్థాయి నేతలకు అప్పగించారు.
ఐదు నియోజకవర్గాలు.. మూడు విడతలు..
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల తమ నియోజకవర్గాలైన మధిర, పాలేరు, ఖమ్మం పరిధిలోని 302 జీపీల్లో, వైరా, కొణిజర్ల మండలాల్లోని 49 జీపీల్లో మొదటి, రెండో విడతల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఇక సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోనూ సింహభాగం తమవేనని ఆయా ఎమ్మెల్యేలు, నాయకులు ధీమాతో ఉన్నారు.
ప్రచారం, ఉపసంహరణలు, నామినేషన్లు..
మొదటి దశ ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. దీంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. ఇక్కడ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థులతో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అలాగే మండల స్థాయిలో చరిష్మా ఉన్న నేతలతో మేజర్ గ్రామపంచాయతీల్లో ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఇక రెండో విడతకు సంబంధించి రెబల్స్తో నామినేషన్లను ఉపసంహరింపజేసే పనిలో నేతలున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. ఇక్కడ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులతో నామినేషన్లు వేయించే ప్రక్రియ సాగుతోంది.
మధిర
131
పాలేరు
134
వైరా
94
సత్తుపల్లి
129
ఖమ్మం
37


