సమాజంలో మార్పు ఆశిస్తున్నా..
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా సాదాసీదా జీవితాన్ని గడపడమే కాక, తనకు వచ్చే జీతాన్ని సైతం పేదల కోసం ఉపయోగిస్తున్న గొప్ప వ్యక్తి గుమ్మడి నర్సయ్య అని, ఆయన జీవితచరిత్రఆధారంగా తీస్తున్న సినిమాతో సమాజంలో కొంతైనా మార్పు రావాలని ఆశిస్తున్నానని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై నల్లా సురేష్రెడ్డి నిర్మిస్తున్న గుమ్మడి నర్సయ్య(ప్రజల మనిషి) సినిమా షూటింగ్ను శనివారం ఆయన పాల్వంచలో ప్రారంభించి మాట్లాడారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నా ఇప్పటివరకు ఏ సినిమాకూ క్లాప్ కొట్టలేదని, షూటింగ్లకు వెళ్లలేదని, నర్సయ్యపై ఉన్న అభిమానంతోనే పాల్వంచకు వచ్చానని తెలిపారు. నర్సయ్య జీవితాన్ని సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, తనతో పాటు రాష్ట్రంలో ఏ నాయకుడూ నర్సయ్యకు సాటిరారని చెప్పారు. షూటింగ్ కొంత ఆలస్యమైనా సరే కానీ పాన్ ఇండియా స్థాయిలో తీయాలని సూచించారు. తన కుటుంబానికి ఎంతో సన్నిహితులైన సురేష్రెడ్డి ఈ సినిమా తీయడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మొదట పాల్వంచ నుంచే ప్రారంభమైందని, గుమ్మడి నర్సయ్య వంటి జననేత తెలంగాణ వాసి కావడం గర్వంగా ఉందని అన్నారు. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పునకు ఇలాంటి గొప్ప రాజకీయ నేత చరిత్ర అవసరం అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ఆదర్శం గుమ్మడి నర్సయ్య అన్నారు. హీరో శివరాజ్కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రతీ రాజకీయ నాయకుడికి ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. నిర్మాత నల్లా సురేష్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పాల్వంచకు ప్రత్యేక స్థానం ఉందని, దీన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి నర్సయ్యతో పాటు పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వరు, జారె ఆదినారాయణ, సమాచార హక్కు కమిషనర్ పి.వి.శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, సినీ దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే, నాయకులు నాగ సీతారాములు, వై.మధుసూదన్రెడ్డి, యుగంధర్ రెడ్డి, ఎడవల్లి కృష్ణ, కోనేరు చిన్ని, ముక్తేవి గిరీష్, వజీర్, అనురాధ పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కోమటిరెడ్డి
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశాక అమ్మవా రి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట హీరో శివరాజ్కుమార్, సినిమా నిర్మాత నల్లా సురేష్రెడ్డి తదితరులు ఉన్నారు.
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్
ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి


