సామినేని మృతిపై న్యాయ విచారణ చేపట్టాలి
● అది ముమ్మాటికీ రాజకీయ హత్యే ● సీపీఎం నేతలు పోతినేని, నున్నా నాగేశ్వరరావు
ఖమ్మంమయూరిసెంటర్/చింతకాని: సీపీఎం నా యకుడు సామినేని రామారావు మృతిపై న్యాయమైన విచారణ చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో, చింతకానిలో ఆదివా రం వారు మాట్లాడారు. పాతర్లపాడులో సీపీఎం ఎదుగుదలను చూసి ఓర్వలేక, పంచాయతీ ఎన్నికల్లో అక్కడ సీపీఎం విజయం సాధించకూడదనే దుర్బుద్ధితోనే హత్యకు పాల్పడ్డారని అన్నారు. హత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. మధిర నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒత్తిడి మేరకు పోలీసులు.. హత్యకు కుట్రదారులైన ఐదుగురు కాంగ్రెస్ నాయకులను విచారించకుండా రామారావు కుటుంబసభ్యులను వేధిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలోని ఐదుగురు కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో హత్య జరిగిందని తెలిసినా వారిని అరెస్ట్ చేయలేదన్నారు. రామారావుకు వ్యక్తిగత వివాదాలు, ఆస్తి తగదాలు లేవని, పార్టీలో నిజా యితీ, క్రమశిక్షణ గల నాయకుడిగా పేరుందని చెప్పారు. చంపింది ఎవరైనా, చంపించింది మాత్రం కాంగ్రెస్ నాయకులేనని, వారిని విచారించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యను ఖండిస్తూ ఈనెల 4, 5 తేదీల్లో సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. పాతర్లపాడులో ఈనెల 8న జరిగే సంస్మరణ సభకు పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతారని వివరించారు. ఆయా సమావేశాల్లో నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బండి రమేష్, మాదినేని రమేష్, బొంతు రాంబాబు, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, చింతకాని మండల కార్యదర్శి రాచబంటి రాము, వత్సవాయి జానకిరాములు పాల్గొన్నారు.
ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
చింతకాని: మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య జరిగి మూడు రోజులు గడిచినా నిందితుల ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో నింది తుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు ఖమ్మం సీపీ సునీల్దత్ పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఈ హత్యపై ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక బృందాలు నిందితుల గాలింపు కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరిస్తున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కాల్ డేటాను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. రామారావు హత్యకు ఏపీలో పథక రచన చేసినట్లు వస్తున్న సమాచారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హంతకులను త్వరగా గుర్తించాలని కుటుంబీకులు కోరుతున్నారు.


